అకాల వర్షాతో అన్నదాతల ఆందోళన 

జనగామ,మే3(జ‌నం సాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు. వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో వారు మరింత భయంలో ఉన్నారు. ఇటీవల  కురిసిన అకాల వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిచిపోయింది. మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం ఎగుమతిలో జాప్యం జరుగుతుండటంతో రైతులు వర్షానికి వాటిని కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. లారీల రాకపోకల్లో జాప్యం జరగడంతో తేమ శాతం నిబంధనల మేర భారీవర్షం కురిస్తే బస్తాల్లో నిల్వచేసిన ధాన్యం ఏ క్షణాన ముద్దవుతుందేమోనని రైతులు, కొనుగోలు నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.  రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తరలించి తేమకోసం ఆరబోసుకొని విక్రయానికి సిద్ధమవుతున్నా పరిస్తితులు అనుకూలించడం లేదు.  కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ చేసుకొన్న రైతులు చిన్నపాటి చినుకుపడినా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇటీవల వడగండ్లతో వానతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కొద్దిపాటి జల్లు కురిసింది. దీంతో కొంత మంది రైతులు తేమ శాతం కోసం ఆరబోసుకున్న వారు ఆందోళనకు గురయ్యారు.  ధాన్యం బస్తాలు తడవకుండా ప్రభుత్వం సరఫరా చేసిన, తమవద్ద ఉన్న టార్పాలిన్లను కప్పుకొని అప్రమత్తమయ్యారు. ధాన్యాన్ని ఆరబోసుకొన్న రైతులు, బస్తాల్లో నిల్వచేసుకొన్న రైతులు వర్షానికి తడవకుండా రక్షణ చర్యలు తీసుకొన్నారు. కొన్నింటికి ధాన్యం తరలింపు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం గన్నీ బస్తాల కొరత కూడా లేదు. ఇదిలావుంటే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా మభ్యపెడుతోందని టిడిపి మాజీ ఎమ్మెల్యే  సీతక్క  ఆరోపించారు. దళారులకు తెరాస ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యాపారులను వేడుకున్నా వారు స్పందించకపోయే సరికి కడుపుమండి ఆందోళనకు దిగితే రైతులను రౌడీలు, గూండాలు, దేశద్రోహులంటూ ముద్రవేసి వారిపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.