అఖిలేష్‌కు బాబాయి షాక్‌!

– శివపాల్‌ కొత్త పార్టీకి అడుగులు

– ‘సమాజ్‌ వాదీ సెక్కులర్‌ మోర్చా’గా నామకరణం

న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌ వాదీ పార్టీలో చీలిక ఏర్పడింది. ములాయం సోదరుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు, ములాయం కుమారుడైన అఖిలేశ్‌ యాదవ్‌తో శివపాల్‌కు విభేదాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరును ‘సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా’ గా ప్రకటించారు.’నాకు పార్టీలో ఎలాంటి పని కల్పించడం లేదు. అందుకే నేను సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాను. సమాజ్‌వాదీ పార్టీ ఐకమత్యంగా ఉండాలని అనుకున్నాను. అందుకే నేను చాలా రోజులు ఎదురుచూశా. పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కకు పెడుతున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అని శివపాల్‌ వెల్లడించారు. రెండేళ్ల క్రితం శివపాల్‌కు, అఖిలేశ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్‌ను అఖిలేశ్‌ తొలగించడంతో వివాదం ప్రారంభమైంది. అప్పట్లో తమ్ముడు శివపాల్‌కు ములాయం బాసటగా నిలిచారు. దీంతో అఖిలేశ్‌, ములాయంల మధ్య కూడా తేడాలు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీలో శివపాల్‌కు ప్రాధాన్యం లభించడం లేదని తెలుస్తోంది. గత నెలలో జరిగిన పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ సమావేశానికికూడా శివపాల్‌ హాజరుకాలేదు. శివపాల్‌ కొత్త పార్టీ ఏర్పాటుతో సమాజ్‌వాదీ పార్టీలో భారీగా చీలిక వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలు సైతం రెండు వర్గాలుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.