అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య

నాగపూర్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి):   వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ 45 ఏళ్ల వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారం ముంగిట వార్తాపత్రికలు పడి ఉండడం.లోపలి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఖాపర్ఖేండకు 4 కిలోమీటర్ల దూరంలో గల చంకాపూర్‌లోని డబ్ల్యుసిఎల్‌ క్వార్టర్స్‌లో చోటు చేసుకుంది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో  ఖాపర్ఖేడ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న దంపతుల శవాలను కనుక్కున్నారు. నీలం(35) శవం పడకపై పడి ఉండగా ఆమె భర్త కుశ్వా శవం ఇంటి పైకప్పునకు దుపట్టాతో వేలాడుతూ కనిపించింది.
కుశ్వా నాలుక నోటి బయటకు వచ్చింది. దీన్ని బట్టి భర్త ఆమెను ఉరేసి చంపి ఉంటాడని భావిస్తున్నారు. శవాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.నవంబర్‌ 5వ తేదీ  నుంచి వార్తాపత్రికలు తలుపు దగ్గరే పడి ఉన్నాయి. దాన్ని బట్టి సంఘటన నవంబర్‌ 4వ తేదీన జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
కుశ్వా ఎలక్ట్రీపియన్‌గా పనిచేస్తుండగా నీలం హౌస్‌ వైఫ్‌ మాత్రమే. దంపతులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. కుశ్వా ఉత్తరప్రదేశ్‌లోని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. నీలం కూడా తన మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆరేళ్ల క్రితం నీలం కుశ్వా పెళ్లిచేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ ఏదీ కనిపించలేదు.