అబద్దాల ప్రధానిగా..  మోడీ చరిత్రలో నిలిచిపోతారు


– మోడీలాంటి దివాళాకోరు రాజకీయాలు ఇంతవరకు చూడలేదు
– మంత్రి నక్కా ఆనంద్‌బాబు
గుంటూరు, జనవరి3(జ‌నంసాక్షి) : దేశానికి ప్రధానిగా ఉన్న సాక్షాత్తూ మోడీనే ఆంధ్రప్రదేశ్‌పై అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటని, మోడీలాంటి హూందాతనం లేని ప్రధానిని ఇప్పటి వరకు చూడలేదని, అబద్దాల ప్రధానిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారని ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సాక్ష్యాత్తు దేశ ప్రధాని ఆంధప్రదేశ్‌పై అబద్దాలు మాట్లాడటం మంచి పద్దతి కాదని అన్నారు. ప్రధానమంత్రికి ఉండాల్సిన కనీస హుందాతనం లేకుండా మాడ్లాడుతున్నారని విమర్శించారు. మోదీలాంటి దివాళాకోరు రాజకీయ నాయకులను ఇంతవరకూ చూడలేదని అన్నారు. బీజేపీ నేతలు.. కన్నా, సోము వీర్రాజుల గలీజు భాషలకు మోదీ
సంబరపడుతున్నారని, ఇది ఐదుకోట్ల ఆంధ్ర ప్రజలను అవమానించినట్లేనని ఆనంద్‌బాబు అన్నారు. ఐదేళ్లు
రాష్ట్రాన్ని దోచుకున్న కన్నా.. తన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే బీజేపీలో చేరారని మంత్రి ఆనంద్‌బాబు విమర్శించారు. సీఎంని అసభ్యంగా మాట్లాడడం సంస్కారమా? అని ప్రశ్నించారు. ప్రధానిగా వారి వ్యాఖ్యలను ఖండించాల్సిన కనీస బాధ్యత లేదా అని అన్నారు. చంద్రబాబును చూస్తే మోదీకి భయం వేస్తుందని, అందుకే ఉపాధి కులీల నిధులు కుడా విడుదల చేయకుండా కేంద్రం కక్ష సాధిస్తోందని మంత్రి విమర్శించారు. జగన్‌ను కాపాడేందుకే ఆగమేఘాలపై హైకోర్టును విభజించారని, బీజేపీకి దమ్ముంటే జగన్‌తో కలిసి పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ఏపిలో పోటిచేయడానికి బిజెపికి అభ్యర్థులు ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెప్తామని నక్కా ఆనంద్‌ బాబు అన్నారు.