అభివృద్ది పనులు చేశా..మళ్లీ గెలిపించండి

ప్రచారంలో షాద్‌నగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌

రంగారెడ్డి,నవంబర్‌23(జ‌నంసాక్షి): అభివృద్ది చేశా తిరిగి మరోసారి ఆదరించాల్సిందిగా కోరుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేశంపేట మండలం భైరఖాన్‌ పల్లి గ్రామంలో నేడు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. సీసీ రోడ్లు, మట్టి రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం, ఆసరా పించన్లు మంజూరు, అంతర్గత మురుగుకాల్వల నిర్మాణం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ద్వారా త్రాగునీరు, సాగునీరు అందజేతతో పాటు తాను చేసిన ఇతర అభివృద్ధి పనులను వివరించారు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న కారు గుర్తు పార్టీకి ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవనే భయంతోనే చేతగాని నాలుగురితో పొత్తులు పెట్టుకుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ హయాంస్వర్ణయుగమని, పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ చీకటిమయం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తుందన్నారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తీసుకువచ్చిన రైతుబంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.