అమానుషం.. రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ , అత్యాచారం..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఉదయం 6.30 గంటల సమయంలో పొదల్లో ఉన్న బాలికను అటుగా వెళ్లిన ఓ మహిళ గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారి పెదవులపై గాట్లు ఉండడం, శరీరంపై గాయాలు ఉండడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అత్యాచారానికి గురైనట్టు పరీక్షల్లో తేలింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిందితుడు బాలికను ఎత్తుకెళ్తుండడం సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు తెలిపారు. దాని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌కు చెందినవారని, వలస వచ్చి జోధ్‌పూర్‌లోని ఓ మురికివాడలో ఉంటున్నట్టు  తెలిపారు. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడని, బాలిక తల్లి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వివరించారు. వారికి ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నట్టు చెప్పారు.