అమిత్షా జాతీయ జెండా ఆవిష్కరణలో అపశ్రుతి
– నేలను తాకిన జాతీయ జెండా
– జాతీయ జెండానే ఎగరవేయలేని వారి పాలన ఎలా చేస్తారు
– కాంగ్రెస్ నేతలు, నేటిజన్ల విమర్శలు
న్యూఢిల్లీ, ఆగస్టు15(జనం సాక్షి) : స్వాతంత్య దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో భాజపా
జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పతాకావిష్కరణ చేసే కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన జాతీయ జెండాను ఎగరవేస్తున్నప్పుడు పొరపాటున జెండా నేలకు తాకింది. అంతలోనే తేరుకున్న అమిత్షా మళ్లీ తన పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఈ తప్పిదానికి సంబంధించిన వీడియో సోషల్ విూడియాకు ఎక్కడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. సదరు వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఉంచింది. జాతీయ పతాకాన్ని సరిగ్గా ఆవిష్కరించలేని వారు దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు జతచేసింది. మది నిండా దేశభక్తి ఉందని చెప్పుకునే వారికి జాతీయ గీతాన్ని ఎలా ఆలపించాలో తెలీదంటూ విమర్శలు గుప్పించింది.
ఇలాంటి పొరపాట్లు జరగడం.. విమర్శలు వెల్లువెత్తడం ఇదే తొలిసారి కాదు. 2016లో ఆగస్టు 15న సందర్భంగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ జెండావిష్కరణ కార్యక్రమంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జాతీయ జెండా కింద పడిపోతుండడంతో ఆమె చేతుల్తో పట్టుకున్నారు. కొన్నేళ్ల క్రితం జనతా దళ్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తుండగా జాతీయ జెండా నేలను తాకింది.
————————-