అమెరికాలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్య

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సంతతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రుత్గర్స్‌ యూనివర్శిటీలో చదువుతున్న 21ఏళ్ల షానీ పటేల్‌ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో పటేల్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిసిందని, నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. అయితే కాల్పులు ఎందుకు జరిపారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.