అర్హులందరికీ ఆసరా పింఛన్లు

గ్రామసభలో సర్పంచ్ సరస్వతి
అశ్వరావుపేట సెప్టెంబర్ 5 ( జనం సాక్షి) అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు వస్తాయని, దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ సరస్వతి ప్రజలను కోరారు. సోమవారం సర్పంచ్ సరస్వతి అధ్యక్షతన పంచాయతీ కార్యాలయంలో గ్రామసభను నిర్వహించారు. ఇటీవల మంజూరైన 57 కొత్త పింఛన్లను సర్పంచ్ సరస్వతి, కార్యదర్శి అనూష చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఆసరా కోసం కొత్తగా పింఛన్ కావాలనుకున్నవారు దరఖాస్తు చేసుకుంటే సకాలంలో అందించే విధంగా చూస్తామన్నారు. గ్రామాల్లో ప్రజలు దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షాకాలం సీజన్ కావడంతో ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటి నిల్వలు ఉండకుండా చూడాలని సర్పంచ్ ప్రజలకు సూచించారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జుజ్జురి రాంబాబు, ఎంపీటీసీ నాగలక్ష్మి, కార్యదర్శి అనూష, బొల్లు కొండ చెన్నారావు, సున్నం రామ లక్ష్మయ్య, గ్రామ పెద్దలు డాబా జగ్గారావు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు