అవిశ్వాసం పెట్టినందుకు ధన్యవాదాలు

– ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను బయటపెట్ట గలిగాం

– భాజపా పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జులై31(జ‌నం సాక్షి ) : తమ ప్రభుత్వంపై ఇటీవల విశ్వాస తీర్మానం పెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్లే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను బయటపెట్టే అవకాశం లభించిందని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం భాజపా పార్లమెంటరీ సమావేశాని మోదీ హాజరై ప్రసంగించారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం భాజపాతో పాటు మిత్రపక్షాల విజయమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వారి రాజకీయ అపరిపక్వతను, అవగాహన లేమిని చూపుతోందని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్షాలు ప్రజల అవసరాలను వినియోగించుకుంటున్నాయని అన్నారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రజల ఇబ్బందులు తొలగించకపోగా.. నాలుగేళ్లలో మెరుగైన పాలన అందిస్తున్న బీజేపీపై ఆరోపణలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. భాజపా సీనియర్‌ నేతలు నితిన్‌ గడ్కరీ, సుష్మా స్వరాజ్‌, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు మోదీని సన్మానించినట్లు తెలిపారు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినప్పుడో, దేశంలో తీవ్రమైన అశాంతి నెలకొన్నప్పుడో అవిశ్వాసం పెడతారు.. కానీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టడానికి అసలు ఎలాంటి కారణం లేదని, 326 ఓట్ల మెజార్టీతో అవిశ్వాస తీర్మానం నెగ్గాం’ అని అమిత్‌షా అన్నట్లు అనంత్‌కుమార్‌ చెప్పారు. సమావేశంలో మోదీ కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ప్రశంసించారని, అవిశ్వాసంపై రాజ్‌నాథ్‌ చేసిన ప్రసంగాన్ని మోదీ మెచ్చుకున్నారని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు వెల్లడించారు.