ఆంధ్రాకు అన్యాయంచేస్తున్న వారికి వత్తాసా

వైకాపా,జనసేనలపై టిడిపి మండిపాటు
గుంటూరు,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఆంధ్రాకు అన్యాయం చేసే చర్యలు చేపట్టిన కేసీఆర్‌, హరీష్‌రావు లాంటి వారికి జనసేన, వైసీపీలు మద్దతు పలుకుతుండడం దుర్మార్గమని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌కల్లాం పదవిలో ఉన్నప్పుడు సీఎంను పొగుడుతాడని, రిటైర్డ్‌ కాగానే జగన్‌పై ప్రేమ పెంచుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో గత పాలకులు కాంట్రాక్టర్ల లబ్దికోసం మట్టి పనులు చేసి వదిలేస్తే కీలకమైన డ్యాం నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతుండగా పోలవరం ప్రాజక్టు పనులు మాత్రమే చంద్రబాబు పర్యవేక్షణలో అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఇది కూడా అజయ్‌కల్లాంరెడ్డి, వైవికృష్ణారావు లాంటి వారికి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు.   రైతులకు ఎంతో మేలు చేసిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించారన్నారు. మిగులు బ్జడెట్‌ ఉన్న తెలంగాణలో రైతులకు ఏమి చేశారో, లోటుబ్జడెట్‌ అయిన ఏపీలో తాము ఏం చేశామో ప్రజలకు అర్థమయ్యేలా త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు, లోటుబ్జడెట్‌ ఉన్నప్పటికీ తెలంగాణ కంటే రైతులకు రెండింతలు మేలు చేశామని వివరించారు. కేసీఆర్‌ చేసిన దానికే ప్రజల నుంచి అంత మద్దతు వస్తే ఏపీలో మేం చేసిన అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందన్నారు. ప్రత్యర్థి పార్టీల అడ్రసులు గల్లంతయ్యే పరిస్థితి వస్తుందన్నారు.