ఆకాశమే హద్దు..

` ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం.
` కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
` అమెరికాకు నేరుగా విమానాలు నడపాలి
` కేంద్ర మంత్రికి మంత్రి కోమటిరెడ్డి వినతి
` బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా`2024’ ప్రదర్శన ప్రారంభం
హైదరాబాద్‌(జనంసాక్షి): పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్యా 260 మిలియన్‌లు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా`2024’ వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.’’2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్‌ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. ముంబయి, దిల్లీలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇటువంటివి మరిన్ని నిర్మించాల్సి ఉంది. ఉడాన్‌ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్‌ ప్రయాణాలు అమలు చేస్తున్నాం. కశ్మీర్‌ అభివృద్ధికి ఇది మరింత దోహదం చేస్తుంది. డ్రోన్‌లకు డిమాండ్‌ పెరగడంతో.. మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నాం. ఉడాన్‌ 5.3ను నేడు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్‌ అత్యధిక ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోదీ సంకల్పించారు. ఆ దిశగా ముందుకెళ్తున్నాం.. ఆకాశమే మన హద్దు’’ అని సింధియా చెప్పారు.’’హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉంది. తెలంగాణలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోంది. ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం. డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నాం’’ ` మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిప్రదర్శన కోసం లోహ విహంగాలు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5, 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15`5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. టికెట్‌ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్‌మైషో’ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం. 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
వింగ్స్‌ ఇండియా హైదరాబాద్‌కు గర్వకారణం
అమెరికాకు నేరుగా విమానాలు నడపాలి:మంత్రి కోమటిరెడ్డి
వింగ్స్‌ ఇండియా కార్యక్రమానికి హైదరాబాద్‌ నగరం ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ’వింగ్స్‌ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమవనున్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్‌ నుంచి యూఎస్‌ఏకు నేరుగా వారంలో కనీసం మూడుసార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరామన్నారు. ఎయిర్‌ అంబులెన్స్‌లు ఎక్కువగా హైదరాబాద్‌కు వస్తున్నాయని, డ్రోన్‌ పైలెట్లకు ఎక్కువగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, అత్యవసరాలకు, శాంతిభద్రతల కోసం డ్రోన్లు వినియోగిస్తున్నా మని, రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని, ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నుంచి హైద్రాబాద్‌ మహానగరంలో ’ఇంటర్నేషనల్‌ వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షో’ మొదలు అయ్యింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కు దేశ విదేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్‌ 777`9 తో పాటు అనేక విమానాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈనెల 21వ తేదీ వరకు జరిగే ఈవెంట్‌లో దేశ విదేశాలకు చెందిన ఏరోప్లేన్స్‌ కనువిందు చేస్తాయి. ఈ ప్రదర్శనలో 106 దేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్‌ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.