ఆటో డ్రైవర్పై చేయిచేసుకున్న పోలీసులు
పోలీసుల క్షమాపణతో శాంతించిన ఆటో డ్రైవర్లు
విశాఖపట్నం,నవంబర్23(జనంసాక్షి): రావికమతంలో ఆటో కార్మికునిపై పోలీసులు విరుచుకుపడి చేయి చేసుకొని, బూటు కాళ్లతో తన్నిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం… పి.పొన్నవోలుకు చెందిన ఆటో డ్రైవర్ లంకా రమేష్ గురువారం రాత్రి రావికమతం రోడ్డులో ఆటోని ఆపాడు. అదే సమయంలో కానిస్టేబుల్ శివ, ఎస్ఐ రామకృష్ణలు అటుగా వచ్చారు. ఆటో తీయాలని కానిస్టేబుల్ గదమాయించాడు. ఆటోకు ఎదురుగా మరో బైక్ ఉండడంతో వెంటనే డ్రైవర్ తీయలేక పోయాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్ర దుర్భాషలాడాడు. ఆ ఆటోకు రూ.వెయ్యి అపరాధ రుసుము రాశాడు. అన్ని రికార్డులు, లైసెన్స్లు ఉండగా కేసు ఎందుకు రాశారంటూ ఆటో డ్రైవర్ ప్రశ్నించడంతో కానిస్టేబుల్
చేయి చేసుకున్నాడు. సవిూపంలో ఉన్న ఎస్ఐ రామకృష్ణ, ట్కెన్రీ ఎస్ఐ సుధాకర రావులు కూడా వచ్చి డ్రైవర్ను కొట్టి, బూటు కాళ్లతో తన్నారు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న మరో యువకుడిపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రావికమతంలో గురువారం రాత్రి తీవ్ర సంచలనమైన ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఆటో డ్రైవర్లు పొలీసు స్టేషన్ను ముట్టడించారు. అకారణంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితునికి సవిూపంగా ఉన్న యర్రబంద గ్రామానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా..అతనిపైనా చేయిచేసుకున్నారని, ఈ అవమానాన్ని తట్టుకోలేని ఆటో డ్రైవర్ రమేష్ ఒంటిపై డీజిల్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని, తెలిసిన తోటి ఆటో డ్రైవర్లు స్టేషన్కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన కొత్తకోట సిఐ లక్ష్మణరావు హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకుని వారిని వారించారు. లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే విచారించి చర్యలు చేపడతామని హావిూ ఇచ్చారు. తొలుత కాదన్నా కానిస్టేబుల్ ఆటో డ్రైవర్కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా డ్రైవర్పై తాము చేయిచేసుకోలేదని, కేవలం మందలించామని ఎస్ఐ, ఏఎస్ఐలు సిఐకు వివరించారు.