ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ మరింత వేగవంతం
కాకినాడ,జనవరి22(జనంసాక్షి): గతంలో లేని విధంగా ఆర్టిసి పార్శిల్ సర్వీసును వేగవంతం చేశామని రాజోలు ఆర్టిసి డిపో ఎపిఎస్ఆర్టిసి పార్శిల్ లాజిస్టిక్స్ ఇన్ఛార్జి మాదే కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాజోలులోని స్థానిక పార్శిల్ కార్యాలయంలో మాదే కుమార్ విలేకరులతో మాట్లాడుతూ… ఎపిఎస్ ఆర్టిసి పార్శిల్ లాజిస్టిక్స్ సర్వీసు ద్వారా రాష్ట్రంలో ఏ మారు మూల గ్రామానికైనా 24 గంటల వ్యవధిలో సర్వీసు అందిస్తున్నామన్నారు. గతంలో లేని విధంగా ఆర్టిసి పార్శిల్ సర్వీసును వేగవంతం చేశామని, ప్రజలు పంపించే వస్తువుల భద్రతతో పాటు ట్రేక్ స్టేటస్ కూడా ఉంటుందని తెలిపారు. తమ పార్శిల్ స్వర్వీసు ద్వారా రాజోలు ఆర్టిసి డిపోకు 2018-19 డిసెంబరు నాటికి 30 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని ప్రకటించారు. వేగంగా డోర్ డెలివరీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మాదే కుమార్ వెల్లడించారు.