ఆవుల మృతిపై ఆప్‌ సర్కారు సీరియస్‌

– విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : ఆవుల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారంటూ మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఓ గోశాలలో రెండు రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఆవులు మృత్యువాత పడటం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఢిల్లీలోని గున్‌మెహరా గ్రామంలో ఆచార్య సుశీల్‌ గోశధాన్‌ ట్రస్ట్‌ గోశాలను నిర్వహిస్తోంది. సుమారు 20 మంది కార్మికులు పని చేస్తోన్న ఈ గోశాలలో వందల సంఖ్యలో ఆవులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆవులు మృత్యువాత పడుతున్నాయి. సుమారు 32 నుంచి 48 ఆవులు చనిపోవడంతో ఆందోళన చెందిన ట్రస్టు సభ్యులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆవుల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా ఈ గోశాలను శుభ్రం చేసేందుకు ఢిల్లీ మున్సిపల్‌ కార్మికులు తరచుగా ఇక్కడికి వస్తూ ఉండటం.. ఢిల్లీ వాటర్‌ బోర్డు నీటిని సరఫరా చేస్తుండటంతో ఢిల్లీ సర్కారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ల బృందాన్ని గోశాలకు పంపించింది. ఆవుల మృతికి గల కారణాలపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన  ఈ గోశాలను 1995లోప్రారంభించినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.