ఆశ వర్కర్లకు రు.18 వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి

టేకులపల్లి,సెప్టెంబర్ 25( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశ వర్కర్లకు పారితోషికాలతో పాటు రూ.18,000/లకు పెంచి ఫిక్సిడ్ వేతనాన్ని నిర్ణయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సమ్మెలో వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారని, వీరంతా గిరిజన మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారని, ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక శిక్షణలు పొందారు. రీజెస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పని చేయడం, బిపి, షుగర్, థైరాయిడ్ తదితర అన్నిరకాల వ్యాధులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మందులను గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేస్తున్నారని గ్రామాలలో వారి సేవలు అమోఘం అన్నారు. అలాంటి ఆశ కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనంగా పెంచి ఇవ్వాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. వీటితో పాటు గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారని,గతంతో పోలిస్తే ఈ కాలంలో ఆశా వర్కర్లకు పనిభారం పెరిగిందని, పని చేస్తున్న ఆశా వర్కర్లకు కేవలం రూ.9,750/-లు పారితోషికాలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది.ఒకవైపు పని భారం పెరగడంతోపాటు మరొకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిలో వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ఆశా కార్యకర్తలకు పారితోషికాలకు బదులు పర్మినెంట్ వేతనంగా రూ.18,000/-లకు పెంచి ఇవ్వాలన్నారు.