ఆ మంత్రులు అవినీతిపరులు

` 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసింది
` 40% సర్పంచ్‌లను గెలుచుకున్నాం: కేటీఆర్‌
ఖమ్మం(జనంసాక్షి): ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30శాతం కవిూషన్లు వసూలు చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌
ఆరోపించారు. ఖమ్మం నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం సర్పంచ్‌లను బీఆర్‌ఎస్‌ గెలుచుకుందన్నారు. 420 హావిూలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌.. ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కార్పొరేటర్లను కాంగ్రెస్‌లో చేర్పించే పనిలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేవిూ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేవిూ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. నాడు ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం కేసీఆర్‌గారు సీతారామసాగర్‌ ప్రాజెక్టును నిర్మించతలపెట్టి 90 శాతం పనులను పూర్తిచేశారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, గోదావరి జలాలపై పూర్తి హక్కులు ఖమ్మం జిల్లాకే దక్కాలని నాడు కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని విమర్శించారు.ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కవిూషన్‌లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును పక్కనపెట్టారని మండిపడ్డారు. ఆ ముగ్గురు మంత్రులు ప్రజలకు మేలు చేయగల మొనగాళ్లు కాదని, మోసగాళ్లని కేటీఆర్‌ విమర్శించారు. వారు 30 శాతం చొప్పున కవిూషన్‌లు వసూలు చేసి జేబులు నింపుకోవడమే తప్ప జిల్లాకు పనికొచ్చే పనులు ఒక్కటి కూడా చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సమయంలో ఈస్ట్‌మన్‌ కలర్‌లో సినిమా చూపెట్టారని, ఇదిస్తాం.. అదిస్తాం అని నోటికొచ్చిన హావిూలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏదీ ఇవ్వలేదని విమర్శించారు.అశ్వారావుపేటలో ఒక్క సీతారామసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 1.30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా కేసీఆర్‌ డిజైన్‌ చేశారని కేటీఆర్‌ చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు, ఇల్లందు నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 10 వేల ఎకరాలకు, వైరాలో 20 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కేసీఆర్‌గారు సీతారామ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. కానీ ఆ ప్రాజెక్టును ప్రభుత్వం పక్కనపెట్టింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందంటే.. అది ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలేని, కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.