ఇంజినీరింగ్‌ విద్య ‘దశ-దిశ’పై అవగాహన

విశాఖపట్నంలో ఈ నెల 24న సదస్సు

విశాఖపట్నం,జనవరి22(జ‌నంసాక్షి): ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతే వేగంగా పెరుగుతున్న జనాభా… విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో గణనీయంగా మార్పులు దీనికి దోహదపడుతున్నాయి. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో వాస్తవానికి మనం చూస్తున్న, చూడబోయే అభివృద్ధి అంతా ఇంజినీర్ల కృషే అని చెప్పాలి. దీనిపై ఎప్పటికప్పుడు సందేహాలు, అనుమానాలు పెరగుతున్నాయి. దీంతో వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ, ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ నెల 24న సదస్సు జరుగనుంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టులు, మెగా విద్యుత్‌ స్టేషన్‌లు, ఆధునిక యంత్రాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, అత్యాధునిక భవనాలు, ఎన్నో రకాల రవాణా వాహనాలు, 3జీ, 4జీ, 5జీ మొదలుకుని సమాచార, మొబైల్‌ విప్లవం వంటి అంశాలను చర్చిస్తారు. ఇలా ఒకటేమిటీ ఆధునిక ప్రపంచం అంతా ఇంజినీర్ల సృష్టి అనే చెప్పాలి. నిపుణులైన, నిష్ణాతులైన ఇంజినీర్లకు ఆదరణ వెలకట్టలేనిది. ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకుని వెళ్తోంది. మహా నగరాలు, స్మార్ట్‌ సిటీలు, నూతన రాజధానుల నిర్మాణం, సోలార్‌ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దేశ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేసే దిశగా ఇస్రో ప్రతిష్ఠాత్మకమైన ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తోంది. ఇంతటి మహాద్భుతాలు సాధిస్తోంది ఇంజినీర్లే కావడంతో ఇంజినీరింగ్‌ విద్యకు డిమాండ్‌ ఉండటం సహజమే. అయితే.. ఏ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలి? ఎటువంటి విద్యాసంస్థలో చేరాలి? ఎటువంటి వసతులు, మౌలిక సదుపాయాలున్న విద్యాసంస్థలను ఎంచుకోవాలి? విద్యావిధానం ఎలా ఉంటే విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడుతుంది? కళాశాల విద్యకు విశ్వవిద్యాలయం ¬దా పొందిన విద్యాసంస్థల్లో విద్యా విధానం ఎలా ఉంటుంది? ప్రమాణాలు ఎలా ఉంటాయి? వాటిని గుర్తించడం ఎలా? దేశాభివృద్ధిలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల కీలకపాత్ర ఎంతవరకు ఉంది? ఇంజినీరింగ్‌ తరువాత ఉద్యోగాన్ని, ఉన్నత విద్యను ఎంచుకోవడం ఎలా? ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కావాలా? పరిశోధన అంటే ఏమిటి? పరిశోధనల కారణంగా విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగాలు ఉన్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు విశ్లేషణాత్మకంగా, సమగ్రంగా తెలియజేయాలనే లక్ష్యంతో ‘కేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ విద్య ‘దశ-దిశ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీకి చెందిన అనుభవజ్ఞులైన, నిష్ణాతులైన ఆచార్యులు, డైరెక్టర్లు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశర చేస్తారు.