ఇచ్చిన హావిూలు అమలు చేయకపోవడమే బాబు స్పెషల్
వరుస ట్వీట్లతో విజయసాయి విమర్శలు
అమరావతి,నవంబర్20(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘జిమ్మిక్కులలో సీఎం నాయుడుబాబుది గిన్నిస్ బుక్ స్థాయి. ఐడియాలు నిస్సిగ్గుగా కాపీకొట్టి అవి తన బుర్ర నుంచే పుట్టినవిగా చెప్పుకుంటూ పబ్లిక్గా అమ్మేసుకుంటాడు. అవినీతితో ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు ఆయన చేసేది శూన్యం అని ఆయన మండిపడ్డారు. 10 వేల కోట్లతో టూరిజం మిషన్, హెలీ టూరిజం, బీచ్ టూరిజం అంటూ చంద్రబాబు ఊదరగొట్టేశాడు. ఐఎన్ఎస్ విరాట్ను కన్వెన్షన్ సెంటర్గా మారుస్తానని కన్సల్టెంట్లకు కోట్లు ధారపోశాడు. రాజమండ్రి రైల్ బ్రిడ్జిని టూరిస్టు అట్రాక్షన్ చేస్తానన్నాడు. మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు’ అని మరో ట్వీట్లో విమర్శించారు. ‘చంద్రబాబు స్వార్థపరుడు, తన గురించే ఆలోచిస్తారు.. తనను తాను ప్రమోట్ చేసుకుంటారు. ఆయన ఎప్పటికీ మంచి నాయకుడు కాలేరు. చంద్రబాబు ఎప్పటికీ ఏపీని అభివృద్ధి చెందనీయరు. ప్రజలను ప్రశాంతంగా జీవించనీయరు’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ.. ఆయన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విజయసాయిరెడ్డి గతకొన్ని రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.