ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు హతం

నగర్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. వీరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అనే ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కొని ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. చనిపోయిన వారు ఉగ్ర సంస్థలోని డివిజనల్‌ కమాండర్‌ స్థాయి ఉగ్రవాదులని భావిస్తున్నారు. అనంతనాగ్‌ జిల్లాలోని మునివార్డ్‌ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ప్రారంభించాయి. ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇంకా ముష్కరులు ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. భారీ ఆయుధాలతో నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని రాష్ట్ర పోలీసులు మంగళవారమే వెల్లడించారు. ఉగ్రవాదుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.