ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు
దీక్ష విరమించాం.. పోరు కొనసాగుతుంది
టీ కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) :
తెలంగాణ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీ కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేపట్టిన 48 గంటల దీక్షను గురువారం విరమించారు. సీనియర్ నేత కే.కేశవరావు వారితో దీక్ష విరమింప జేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ రాష్టాన్న్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను వెంటనే ప్రకటించాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎలాంటి పోరాటాలకైనా, త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదని ప్రజలు బలంగా నమ్ముతున్నారని.. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. దీక్షకు సహకరించినందుకు, సంఘీభావం ప్రకటించిన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే 48 గంటల దీక్ష చేపట్టామని గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై తమ అధిష్టానానికి పాలుపోవడంలేదని, రాష్ట్ర సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, అధిష్టానంపై మరింత ఒత్తిడి తీసుకువస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే అవకాశం కనబడడం లేదని ప్రజలు భావిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే తాము ఆందోళన చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. డిసెంబర్ 9 నాటి ప్రకటనకు కట్టుబడి వెంటనే తెలంగాణను ఏర్పాటు చేయాలని మరో ఎంపీ రాజయ్య కోరారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇంతవరకూ ఎవరు కూడా పార్లమెంట్లో దీక్ష చేపట్టలేదని, తమ నిరసన పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ అంశాన్ని పార్టీ, ప్రభుత్వంతో పాటు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో సఫలమయ్యామని తెలిపారు. తమ ఆందోళనల వల్ల పార్టీ అధిష్టానం పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అంతర్మథనంలో పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదనే బావన ప్రజల్లో ఉన్నందునే తాము దీక్ష చేపట్టామన్నారు. తాము చేపట్టిన 48 గంటల తమ దీక్షతో హైకమాండ్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సందేశం వెళ్లినట్లయిందని.. దీంతో కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తెలంగాణపై స్పందిస్తుందని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హైకమాండ్ను తప్పుదారి పట్టిస్తున్నారని ఎంపీ వివేక్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే.. ఢిల్లీకి వచ్చి వేరేలా చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ఎమ్మెల్యేలను, ఎంపీలను మేనేజ్ చేస్తానని హైకమాండ్కు నివేదికలిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తీసుకొనే నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటానని చెబుతున్న కిరణ్ తెలంగాణ ఉద్యమంపై హైకమాండ్ను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీ-కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న పోరాటం అభినందనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు అన్నారు. తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వారు పార్లమెంట్ ఆవరణలో 48 గంటల దీక్ష చేపట్టారని చెప్పారు. టీ-ఎంపీల చిత్తశుద్ధిపై అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. పార్లమెంట్ లోపలా, బయటా తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు. టీ-జేఏసీ దీక్షకు తమ దీక్ష పోటీ కాదని కేశవరావు విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తమకు జేఏసీతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జేఏసీ చేపట్టిన అన్ని ఆందోళనల్లో తాము స్వయంగా పాల్గొన్నామని గుర్తు చేశారు. జేఏసీ పోరాడినా, తాము ఆందోళన చేసినా అది రాష్ట్ర సాధన కోసమేనన్నారు.