ఈవీఎంలతోనే వచ్చే లోక్‌సభ ఎన్నికలు

– మళ్లీ పేపర్‌ బ్యాలెట్లకు వెళ్లే ప్రసక్తే లేదు

– ఈవీఎంలపై అనుమానాలను ఈసీ నివృత్తి చేస్తుంది

– కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్‌ అరోరా

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): వచ్చే లోకసభ ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపర్లను వినియోగించే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా స్పష్టం చేసారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేయొచ్చు అంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తిప్పికొట్టింది. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునిల్‌ అరోరా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్‌ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందంటూ సైబర్‌ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్‌ షుజా ఇటీవల చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్‌ బ్యాలెట్లే వాడలంటూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే తిరిగి పేపర్‌ బ్యాలెట్లకు వెళ్లే ప్రసక్తే లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్‌ అరోరా స్పష్టం చేశారు. తాజా వివాదం గురించి ఆయన స్పందించారు. తిరిగి కాగితం బ్యాలెట్ల రోజులకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. మేం ఈవీఎంలనే కొనసాగిస్తామని, 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయని, కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారన్నారు. గెలిచిన వారికి ఈవీఎంలు మంచివేనని, ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అంటారని అన్నారు. ఈవీఎంలేం ఫుట్‌బాల్‌ కాదని, దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల పక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్‌ యంత్రాలను కూడా తీసుకొచ్చామని సునిల్‌ అరోరా చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు, వివాదాలను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.