ఉదయిస్తున్న తరానికి ప్రతినిధిని: పవన్ కళ్యాణ్
అమలాపురం,నవంబర్29(జనంసాక్షి): ఉదయిస్తున్న తరానికి తాను ప్రతినిధిని అని, చంద్రబాబు, లోకేష్, జగన్ అస్తమిస్తున్న తరానికి ప్రతినిధులు అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చేనేత కార్మికులతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనను ఎక్కువగా నమ్మేది యువత, ఆడపడుచులు అన్నారు. ఆడపడుచు కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకని ప్రశ్నించారు. న్యాయం చేసేందుకు ముందడుగు వేయని నాయకులెందుకు అని ప్రశ్నించారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న వారికి మనల్ని పాలించే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తాను వచ్చానన్నారు. జనసేన అంటే చంద్రబాబుకు భయం అని, అందుకే తెలంగాణలో కూడా జనసేన అని మాట్లాడుతున్నారన్నారు. టీడీపీని గౌరవప్రదంగా ఓడిద్దామన్నారు. యువత, ఆడపడుచులే దేశానికి దిశా నిర్దేశం చేయాలన్నారు. సంపద అంటే జగన్కు వేల కోట్లు? చంద్రబాబుకు వేల ఎకరాలు గుర్తుకొస్తాయని, కానీ జనసేనకు సంపద అంటే యువత అన్నారు.