ఉద్దవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ

షిండే గూటికిచేరిన థానేలో 66 మంది కార్పోరేటర్లు

ముంబై,జూలై7(జనంసాక్షి): ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర సీఎం పదవి నుంచి వైదొలగిన
శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 66 మంది పార్టీ కార్పొరేటర్లు షిండే క్యాంప్‌లో చేరారు. 66 మంది రెబెల్‌ కార్పొరేటర్లు బుధవారం రాత్రి సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ఆయన నివాసంలో కలిశారు. సేన కార్పొరేటర్ల తిరుగుబాటుతో ఉద్ధవ్‌ ఠాక్రే టీఎంసీపై పట్టు కోల్పోయారు. మహారాష్ట్రలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తర్వాత టీఎంసీ అత్యంత ప్రతిష్టాత్మక నగరపాలక సంస్ధ కావడం గమనార్హం. సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు నేపధ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయడంతో జూన్‌ 29న మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్‌ షిండే సీఎం పగ్గాలు చేపట్టగా కాషాయ పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు