ఉద్దవ్‌ నిర్ణయంతో మారనున్న మహా రాజకీయం

వ్యూహాత్మకంగా మరింత పట్టు బిగించిన బిజెపి

ముంబై,జూలై14(జనం సాక్షి): రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు శిసేనాని ఉద్దవ్‌ థాక్రే ప్రకటించడం ద్వారా సిఎం ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో తన ఆధిపత్యాన్ని చాటారు. విధిలేని పరిస్థితుల్లో ఉన్నకొద్దిమంది
ఎమ్మెల్యేలను, ఎంపిలను తనతో పాటు నిలబెట్టుకునే క్రమంలో ఉద్దవ్‌ థాక్రే నిర్ణయం తీసుకోక తప్పలేదని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ దెబ్బతో మహారాష్ట్రలో మహావికాస్‌ అఘఘాడి ఉనికి కలోª`పోయినట్లుగానే భావించాలి. అలాగే కాంగ్రెస్‌ కూడా పూర్తిగా ప్రమాదం అంచుల్లోకి వెళ్లినట్లే. ఎందుకంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు బిజెపిలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. శరద్‌ పవార్‌ బలం కూడా బాగా తగ్గనుంది. అధికారం లేకపోతే ఎన్సీపి ఆటలు సాగవు. మొత్తంగా బిజెపి విసరిన పాచిక పారడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ముకు ఉదవ్‌ థాక్రే మద్దతు ప్రకటించారు. ఆమెకు మద్దతు ఇవ్వాలని తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, తన ఎంపీలు కూడా బలవంత పెట్టలేదని చెప్పుకున్నా అది నమ్మశక్యంగా లేదు. బీజేపీతో మళ్లీ దోస్తీకి దారులు తెరవండి అని ఎంపీలు చేస్తున్న ఈ ఒత్తిడి వెనుక తిరుగుబాటు ఎత్తుగడే ఉన్నప్పటికీ, వారి మాట కాదనకుండా గుంభనంగా సై అన్నారు. కనీసం పన్నెండుమంది ఎంపీలు షిండేవర్గం వైపు దూకేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమై నందున కనీసం వారినైనా కాపాడుకోవాలంటే ఇలా దిగిరాకతప్పదు. గతంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే ముందు కూడా బీజేపీతో రాజీకి రమ్మని ఠాక్రేను కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీల మాట వినకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారని బీజేపీ నాయకుల హెచ్చరికలు కూడా పనిచేశాయి. ఈ నేపథ్యం లో ఉద్ధవ్‌ నిర్ణయం విధిలేకతీసుకున్నదే అయినా, బీజేపీ శివసేనల మధ్య మళ్లీ సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడగలదు. ఈ చర్యతో బీజేపీతో రాజీకి తాను సిద్ధమేనన్న సంకేతాన్ని ఇచ్చారనీ, బీజేపీ పెద్దలతో సుహృద్భావాన్ని కోరుకుంటున్నట్టు అర్థమని కొందరు విశ్లేషిస్తున్నారు. షిండేను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చుతున్న సంక్షోభంలో కూడా ఠాక్రేలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ పెద్దలు దిగువస్థాయి నాయకత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఠాక్రే వర్గానికి షిండే వర్గం స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీచేసినప్పుడు కూడా అందులో ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్యలేడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఉండరని అంటారు. ఉద్ధవ్‌ ప్రస్తుత నిర్ణయం ఇరుపార్టీల మధ్యా దోస్తీకి బాటలు పరిచే అవకాశాలు మెరుగయ్యాయి. మహా పర్యటనలో ద్రౌపది ముర్ము ఆయనను కలుసుకొనే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. అదే జరిగితే బీజేపీ అధిష్ఠానం ఈ చర్య ద్వారా సానుకూల సందేశాలు పంపినట్టు భావించవచ్చు. మొత్తంగా మహారాష్ట్ర రాజకీయాలుమళ్లీ బిజెపి హస్తగతం అయ్యాయనే భావించాలి.