ఎట్టకేలకు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి

ప్రమాణం చేయించిన స్పీకర్‌ కోడెల
అమరావతి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎట్టకేలకు మడకశిర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా తిప్పేస్తామి ప్రమాణం చేశారు. ఓటమి పాలైన ఆయన సుప్రీం తీర్పుతో ఇప్పుడు ఎమ్మెల్యేగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం స్పీకర్‌ కోడెల శివప్రాసదరావు ఆయనచేత ప్రమాణం చేయించారు. తిప్పేస్వామి నిర్ణయించిన ముహూర్తానికే అంటే బుధవారం ఉదయమే ప్రమాణ స్వీకారానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అమరావతి అసెంబ్లీలో స్పీకర్‌ తన కార్యాలయంలో తిప్పేస్వామి చేత ప్రమాణం చేయించారు. తిప్పేస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పార్థసారథి, మల్లాది విష్ణు హాజరయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్‌ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించారు.              దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ ఈరన్న ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈరన్న రాజీనామాతో తనతో ఈనెల 20న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలంటూ తిప్పేస్వామి అసెంబ్లీ స్పీకర్‌ ను కోరారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైసీపీ నేతలు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి విజయరాజుకి అందజేశారు. దీంతో బుధవారం తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు.
అసెంబ్లీ సమావేశాలపై ప్రతిపాదన లేదు
ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తామని, అయితే ఇప్పటి వరకు ప్రతిపాదన రాలేదని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. బుధవారం విూడియతో మాట్లాడుతూ సభ నిర్వహణకు తగిన గడువు ఉందని పేర్కొన్నారు. ప్రతీ ఆరు నెలలకు తప్పకుండా సమావేశాలను నిర్వహించాలని చెప్పారు. ఈ ఏడాది బ్జడెట్‌, వర్షాకాల సమావేశాలు తగినన్ని రోజులు జరిగాయని స్పీకర్‌ తెలిపారు. ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ మార్చిలో ఉంటుంది, దానికి ముందు సమావేశాలు నిర్వహించాలో లేదో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. సమావేశాలు నిర్వహించి బ్జడెట్‌కు వెళ్తారో..నేరుగా నిర్వహిస్తారో తెలీదని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తెలిపారు.
ఎట్టకేలకు న్యాయం జరిగింది
ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని, తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. బుధవారం ఉదయం మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణస్వీకారం చేసాక మాట్లాడుతూ ఈరన్నను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నాలుగున్నర సంవత్సరాలు న్యాయ పోరాటం చేశారని, చివరికి న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కోర్టు అతన్ని అనర్హుడిగా ప్రకటించిందన్నారు. కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా జిల్లాకు తీసుకువచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తక్కువ సమయం ఉందని.. అయినా నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు.