ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం

` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్‌
ఢల్లీి,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం మోదీ ప్రభుత్వానికే ఉందన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ బిల్లును ఆమోదించిన మోదీ ప్రభుత్వానికి ప్రహ్లాద్‌ సింగ్‌ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండిరగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దకావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సారథ్యంలోని కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఇంకే నిర్ణయాలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.