ఎన్టీఆర్‌ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు

అనంతపురం,జనవరి17(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని ఈనెల 18నఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా టిడిపి అధ్యక్షుడు బి.కె.పార్థసారథి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహిస్తామన్నారు.పార్టీ శ్రేణులంతా అన్ని ప్రాంతాల్లో వర్దంతిని ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గం కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఇందుకోసం మెగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటినా… ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్‌ సినీనటుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో కరవు నెలకున్న సమయంలో దిల్లీలో జోలిపట్టి భిక్షమెత్తి ప్రజలను ఆదుకున్నారని కొనియాడారు. పార్టీపెట్టిన తొమ్మిదినెలలోనే అధికారంలోకి వచ్చి పేదలకు శాశ్వత పక్కాగృహ నిర్మాణ పథకం వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనుడని అన్నారు. ఎన్టీఆర్‌ వారసుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు.