ఎన్నికల్లో సత్తా చాటాలి: మంత్రి

గుంటూరు,జనవరి24(జ‌నంసాక్షి): ఎన్నికల సమయం సవిూపిస్తుండగా.. నాయకులు, కార్యకర్తలు సత్తా చాటాల్సిన అవసరముందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పెదరావురులో గురువారం ఉదయం వేమూరు నియోజకవర్గ తెలుగదేశం పార్టీ బూత్‌ కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ… పార్టీ అడిగిన సమాచారాన్ని సమగ్రంగా కచ్చితంగా అందించేందుకు బూత్‌ కన్వీనర్లు పని చేయాలని కోరారు. ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించిన తీరును, కింది స్థాయికి కూడా తీసుకుని వెళ్లి పార్టీకి పూర్తిగా ప్రయోజనం కలిగించేలా కార్యకర్తలు, నేతలు సైనికుల్లా పని చేయాలని మంత్రి నక్కా ఆనందబాబు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, బూత్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.