ఎఫ్‌డీఐలకు అనుమతంటే.. జాతికి ద్రోహమే : సురవరం

హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి):
ఎఫ్‌డిఐలకు అనుమతి ఇవ్వడమంటే జాతికి ద్రోహం చేయడమేనని సిపిఐ జాతియ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేందుకు డిసెంబర్‌ మొదటి వారం నుంచి జాతియ స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. శనివారం నాడు మఖ్దుం  భవన్‌లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వదని ఆలస్యంగానైనా కేసీఆర్‌ గుర్తించినందుకు సంతోషమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని ఎప్పుడో తాము చెప్పామని అన్నారు. ఈ విషయంలో ముందు నుంచి కాంగ్రెస్‌ వైఖరి మోసపూరితంగానే ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పోత్తులపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను నారాయణ ఖండించారు. అవసరమైతేనే సిపిఐతో పొత్తు అనడం సమంజసం కాదని ఆయన అన్నారు. అవసరాలు కాదు… సిద్ధాంతాలు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ చెప్పినట్లు బిజెపి మతతత్వ పార్టీయే నని అన్నారు.