ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు మెలిక

ఉన్నత యూనివర్సిటీల పేరుతో ఆంక్షలు
ఆంబేడ్కర్‌ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం
జగన్‌ సర్కార్‌ తీరుపై మండిపడ్డ టిడిపి

అమరావతి,జూలై15(జనంసాక్షి): ఎపిలో ఆర్థికపరిస్థితి వివిధ పథకాలపై ప్రభావం చూపుతోంది. మొన్నటికి మొన్న దుల్హన్‌ పథకాన్ని నిలిపివేసిన సర్కార్‌ ఇప్పుడు విదేశీ విద్యాపథకాలకు కూడా ఆర్థిక సాయం నిలిపివేసింది. దీని నిబంధనలు కఠినతరం చేసింది. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత దళిత వర్గాలకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలు పెరిగిపోయాయని టిడిపి సీనియర్‌ నేత నక్కా ఆనంద్‌బాబు అన్నారు. దళితుల కోసం ప్రత్యేకంగా కేంద్రం అందిస్తున్న పథకాలన్నింటికీ మంగళం పాడేసిందని, చివరకు ఇప్పుడు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధికి కూడా మంగళం పాడిరదన్నారు. మూడేళ్లుగా నిలిపివేసిన విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తూ..ఇటీవల సీఎస్‌ జారీచేసిన జీవో కాపీలో ఎక్కడా అంబేడ్కర్‌ పేరు, ప్రస్తావన లేదన్నారు.. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్ని జగనన్న విదేశీ విద్యాదీవెనగా మార్చే యడం గమనార్హం. అమరావతిలోని శాఖమూరులో 125 ఎకరాల్లో రూ.125 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్‌ స్మృతివనం రద్దు చేసి విజయవాడ నడిబొడ్డులో నిర్మిస్తామని… శంకుస్థాపన చేసి రెండేళ్లవు తుంది. కానీ, ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. ఇదేనా అంబేడ్కర్‌ పట్ల, దళితజాతి మనోభావాల పట్ల జగన్‌ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి అని అన్నారు. ఎస్సీ,ఎస్టీ వర్గాలతో పాటు విద్యార్థిలోకం ఆందోళనలతో దిగివచ్చి మూడేళ్ల తర్వాత విదేశీ విద్య పథకంపై ఎట్టకేలకు జగన్‌ ప్రభుత్వం స్పందించి పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. అదేసమయంలో నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో విదేశీ వర్సిటీలో సీటు తెచ్చుకుంటే ప్రభుత్వం సాయం చేసేది. ఇప్పుడు అది మాత్రమే చాలదని, క్వాలిటీ విదేశీ యూనివర్సిటీ నుంచి అర్హత సాధించాలని కొత్తగా నిబంధన విధించారు. ఈ నిబంధన దగ్గరే చాలామంది ఆగిపోతారని విదేశీ విద్యపై ఆశలు పెట్టుకున్న పలువురు ఆందోళనకు గురవుతున్నారు.
విదేశీ విద్య విషయంలో ఆయన అసలు రంగు బయటపడిపోవడంతో దళిత లబ్దిదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌ హయాం నుంచీ ఎస్సీ, ఎస్టీల విదేశీ విద్య కోసం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం అమలు చేస్తున్నారు. గతప్రభుత్వం కూడా పలు పథకాలకు చంద్రన్న పథకంగా పేరు మార్చింది. అయితే ఈ పథకాన్నిమాత్రం ముట్టుకోలేదు. అయితే జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత ఏ పథకమైనా జగన్‌ పేరు
తగిలించాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న పథకాలన్నింటికీ జగన్‌ పేరు వాడటంతో బీజేపీ నాయకులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్‌ మెమో ఇచ్చి సరిపెట్టుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం మంచి ఫలితాలు ఇచ్చినట్టు గణాంకాలే చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు అంబేడ్కర్‌ విదేశీ విద్యాదరణ పేరిట పథకం అందిస్తే, తక్కిన సామాజిక శ్రేణులకు ఎన్టీఆర్‌ విదేశీ విద్య పేరిట అమలు చేశారు. ఈ పథకం నుంచి అన్నీ వర్గాల విద్యార్థులకు విస్తృత ప్రయోజనం కలిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత, గిరిజన విద్యార్థులకు ఈ పథకం వెలుగులు నింపింది. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఈ పథకాన్ని నిలిపివేసింది. ఇది వరాని అణచివేసే చర్యగా నక్కా ఆనంద్‌బాబు అన్నారు. వెంటనే పథకాన్ని పునరుద్దరించాలన్నారు.