ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని కేంద్రమంత్రి పల్లంరాజు నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పాతబస్తీలోని సుల్తాన్‌ బజార్‌లో నివాసముంటున్న భూపెందర్‌సింగ్‌ ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.46లోని మంత్రి నివాసంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న 55ఏళ్ల భూపేందర్‌సింగ్‌ మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో మృతిచెందాడు. పల్లంరాజు నివాసప్రాంగణంలోని కొలను వద్ద భూపేందర్‌సింగ్‌ పడిపోయి ఉండటాన్ని గమనించిన ఇంట్లోవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన ఘటనాస్థలనికి చేరుకున్న పోలిసులు భూపేందర్‌సింగ్‌ మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే భూపేందర్‌సింగ్‌ గుండెపోటుతో మృతిచెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉదయం 10గంటలకు విధుల్లోకి చేరిన భూపెందర్‌సింగ్‌ మధ్యాహ్ననికి శవంగా కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.