ఒకే కుటుంబానికి చెందిన.. నలుగురు మృతి
– ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
– విచారణ చేపట్టిన పోలీసులు
భోపాల్, జనవరి23(జనంసాక్షి) : భోపాల్లో ఘోర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటనలో ఆ ఇంట్లోని ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో 12 రోజుల పసికందు, 12ఏళ్ల బాలుడు ఉన్నారు. సంజు భాటియా అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడగా.. అతడి భార్య, వారికి ఇటీవల పుట్టిన బిడ్డ, అత్త, 12ఏళ్ల బావమరిది చనిపోయారని పోలీసులు వెల్లడించారు. సుంజు అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉందని, లోపలి కుంపటి ఉందని, దాని పొగకు ఊపిరడక చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విష ప్రయోగం కూడా జరిగే అవకాశం లేకపోలేదని తెలిపారు. మృతుల నోట్లో నుంచి నురగ బయటకు వచ్చిందని అందుకే ఇతర అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పారు. పోస్ట్మార్టం నివేదిక అనంతరం వీరి మృతికి గల కారణాలు బయటపడతాయని తెలిపారు. సోమవారం రాత్రి వారిని చివరి సారిగా చూశామని పొరుగింటి వారు తెలిపారు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా ఇంటి బయటకు రాకపోవడంతో తలుపు కొట్టామని, అయినా స్పందనలేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. తాము వచ్చి తలుపు పగులగొట్టి చూసేసరికే మహిళ, చిన్నారి, ఆమె తల్లి, 12ఏళ్ల ఆమె సోదరుడు చనిపోయారని, ఆమె భర్త సంజు భాటియా అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సంజు భార్య ఇటీవల ప్రసవించడంతో చిన్నారిని చూసుకునేందుకు ఆమె తల్లి, సోదరుడు మహారాష్ట్ర నుంచి వచ్చారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.