ఒక్కటైన తెలంగాణ

1

అఖిలపక్షం గ్రాండ్‌ సక్సెస్‌

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన

మురికివాడల పేదలకు ఇళ్లపట్టాలు

భూఆక్రమణలపై ఉక్కుపాదం

వినాయక్‌సాగర్‌ నిర్మాణం

మెట్రోరైల్‌ అలైన్‌మెంట్‌ మార్పు

ప్రభుత్వ నిర్ణయాలకు విపక్షాల మద్దతు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరానికి సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంతో తెలంగాణ మొత్తం ఒక్కటైంది. ఈ సమావేశంలో హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన, నగరంలో భూ కబ్జాలు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, మెట్రో రైలు అలైన్‌మెంట్‌ మార్పు తదితర అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్‌, పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావు, కాంగ్రెస్‌ ప్రతినిధులు కెఆర్‌.సురేష్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, నిరంజన్‌, టిడిపి ప్రతినిధులు ఎల్‌వి.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నర్సిరెడ్డి, ఎంఐఎం ప్రతినిధులు అక్బరుద్దీన్‌ ఓవైసి, జాఫ్రీ, బిజెపి ప్రతినిధులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి తాటి వెంకటేశ్వర్లు, సిపిఎం ప్రతినిధులు సున్నం రాజయ్య, తమ్మినేని వీరభద్రం, సిపిఐ ప్రతినిధులు రవీంద్రకుమార్‌, చాడ వెంకట్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు వేణుగోపాలాచారి, పి.రాజేవ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీనియర్‌ అధికారులు నర్సింగరావు, ప్రదీప్‌చంద్ర, రేమాండ్‌పీటర్‌, నాగిరెడ్డి, ఎస్‌కె.జోషి, మీనా, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేష్‌కుమార్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు మీనా, శ్రీధర్‌, మెట్రోరైల్‌ ప్రాజెక్టు ఎండి.ఎంవిఎస్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు అన్ని పార్టీల అంగీకారం…

ఈ సమావేశంలో మొదట ముఖ్యమంత్రి హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన అంశాన్ని ప్రతిపాదించారు. ప్రపంచంలో మరే నగరానికి లేనటువంటి గొప్ప అవకాశం, అదృష్టం హుస్సేన్‌సాగర్‌ వల్ల హైదరాబాద్‌కు కలిగిందన్నారు. అయితే హుస్సేన్‌సాగర్‌ మురికికూపంగా తయారు కావడం దురదృష్టకరమన్నారు. అందుకే ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థిక స్థితికి సంకేతంగా హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఆకాశహార్మ్యాలు నిర్మించాలనే ప్రతిపాదనను కూడా ముఖ్యమంత్రి సమావేశంలో ప్రస్తావించారు. వివిధ నాలాల నుంచి వచ్చే మురికినీరు హుస్సేన్‌సాగర్‌లోకి చేరడం వల్ల ఎక్కువ కాలుష్యం అవుతున్నదని చెప్పారు. గణేష్‌ నిమజ్జనం, దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం వల్ల కూడా జల కాలుష్యం జరుగుతుందని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా వినాయకసాగర్‌ నిర్మించే ఆలోచనను కూడా ముఖ్యమంత్రి వివరించారు. హుస్సేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని వివిధ పక్షాల నాయకులు హామీనిచ్చారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఆకాశహార్మ్యాలు నిర్మించాలని అన్ని పార్టీల నాయకులు చెప్పారు.

హైదరాబాద్‌ను సింగపూర్‌లా మార్చాలని కొంతమంది సభ్యులు చెప్పగా ముఖ్యమంత్రి భిన్నంగా స్పందించారు. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, మరో సిటీతో పోల్చాల్సిన అవసరం హైదరాబాద్‌కు లేదని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌ను హైదరాబాద్‌లాగానే అభివృద్ధి చేస్తామని అన్నారు.

 

మురికివాడల పేదలకు ఇళ్లపట్టాలు…

హైదరాబాద్‌లో చాలా మంది పేదలు పొట్టచేతపట్టుకుని వివిధ వివిధ జిల్లాల నుంచి వచ్చి నివసిస్తున్నారని, వారు మురికివాడల్లో అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో తాము గుడిసెలు వేసుకున్న స్థలాన్ని ప్రభుత్వమే వారికి ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. పేదల కోసం ప్రభుత్వమే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుందన్నారు. ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ నిర్ణయం పట్ల అన్ని రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. పేదలు నివాసం ఉంటున్న 80 నుంచి 125 జగాల వరకు వారి పేరిటనే పట్టాలు ఇవ్వాలని ఉచితంగా క్రమబద్దీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.

 

భూకబ్జాలపై ప్రభుత్వం ఉక్కుపాదం…

హైదరాబాద్‌ నగర పరిధిలో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదలుకున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ భూమిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన వారికి రెగ్యులరైజ్‌ చేసుకునే అవకాశం ఇచ్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పార్టీల ప్రతినిధులకు వివరించారు. కబ్జాకు గురయినప్పటికీ ఖాళీగా ఉన్న భూముల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలు జరగకుండా ఒక పటిష్ట చట్టం తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందన్నారు. హైదరాబాద్‌ నగర భూముల కబ్జాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారంలోగా అన్ని పార్టీలకు అందిస్తామని, వాటిని పరిశీలించి ఈ నెల 16న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయాలు చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు.

 

వారసత్వ సంపదకు ముప్పు లేకుండా మెట్రోరైలు నిర్మాణం…

నగరంలోని చారిత్రక ప్రాంతాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రాజెక్టు ముందుకు పోకుండా కొంతమంది కుట్రుల చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, అలాంటి వారి అంచనాలను తొక్కుకుంటూ మెట్రోప్రాజెక్టు శరవేగంగా ముందుకుపోతున్నదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వచ్చాయని, అందుకే మూడు చోట్ల అలైన్‌మెంట్‌ మార్చాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా అసెంబ్లీ వెనుకవైపు వెళ్లేవిధంగా మార్గాన్ని మార్చడానికి, సుల్తాన్‌బజార్‌కు ఇబ్బంది రాకుండా ఉమెన్స్‌ కాలేజీ వెనుకవైపు నుంచి వెళ్లే విధంగా మార్చే మార్గాన్ని ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు. దీనికి సభ్యులు అంగీకారం తెలిపారు. ఓల్డ్‌సిటీలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన రూట్‌ విషయంలో ఇచ్చిన అభ్యంతరాలను సమావేశంలో చర్చించారు. ప్రస్తుత రూట్‌ వల్ల జరిగే విధ&ంసాన్ని ముఖ్యమంత్రితోపాటు మెట్రోరైలు ప్రాజెక్టు అధికారులు వివరించారు. ఈ రూట్‌కు సంబంధించిన వివరాలను సభ్యులకు మ్యాప్‌లతో సహా అందించారు. ఈ విషయంలో కూడా రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను 16న జరిగే సమావేశంలో వెల్లడించాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌కు సంబంధించిన అంశాలను చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అన్ని విషయాలపై చర్చించడం పట్ల అన్ని రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఎలాంటి దాపరికం లేకుండా అన్ని వివరాలను డాక్యుమెంట్లతో సహా రాజకీయ పక్షాలకు అందించే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడాన్ని కూడా నాయకులు అభినందించారు. తనకు మరో ఎజెండా లేదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోతానని, అందుకోసమే అఖిలపక్ష సమావేశం నిర్వహించామని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్తులో అఖిలపక్ష సమావేశాలు కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా సిఎం వెల్లడించారు.