ఓ శకం ముగిసింది! టెస్టుల్లో ఆడతా.. : సచిన్‌ర

ముంబయి, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌):

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ రంగంలో ఓ శకం ముగిసింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వన్డేలకు సెలవు ప్రకటించాడు. వెన్నంటి నిలిచిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపాడు. వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నట్టు ఆదివారం ఉదయం బీసీసీఐకి లేఖ రాశాడు. సచిన్‌ లేఖను బిసిసిఐ ధృవీకరించింది. క్రికెట్‌పై చర్చ ప్రారంభిస్తే అతడి గురించి ప్రస్తావించాల్సిందే. అతని రికార్డుల గురించి చెప్పుకోవాల్సిందే. క్రికెట్‌ అభిమానుల గుండెల్లో అతడొక దేవుడు. అతడు ఆడని బంతి లేదు.. పరుగులు పెట్టని పిచ్‌ లేదు.. తన బ్యాటింగ్‌తో చేయని విన్యాసం లేదు.. అదొక క్రికెట్‌ తరంగం.. అతను సాధించిన రికార్డులన్నీ ఒక్కొక్కటిగా పేరిస్తే ఆయనొక ఎవరెస్టు. క్రికెట్‌ రంగానికి అతడొక ఆస్తి. అతను ఆడిన అద్భుతాలను వర్ణించాలంటే పదాలు చాలవు. రికార్డులు అతని సొంతం.