కబడ్డీకి గుర్తింపు కోసం కృషి

15న లీగ్‌స్థాయి పోటీలు
భూపలపల్లి,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  క్రీడల వలన క్రమశిక్షణ పాటు సమాజంలో మంచి గుర్తింపు
లభిస్తుందని కబడ్డీ అసోసియేషన్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పండుగ శ్రీనివాస్‌ అన్నారు. కబడ్డీకి మళ్లీ ప్రాధాన్యం తీసుకుని రావాల్సి ఉందన్నారు. ఆదివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇటీవల  సబ్‌ జూనియర్స్‌, జూనియర్‌, సీనియర్‌ బాలుర విభాగంలో కబడ్డీ ప్రీమియర్‌లీగ్‌ జిల్లాస్థాయి ఎంపిక నిర్వహించారు. ఈ క్రీడల ఎంపికలను పండుగ శ్రీ నివాస్‌ ప్రారంభించి మాట్లాడారు. కబడ్డీకి ప్రాధాన్యం తీసుకుని  వచ్చేందుకు తమవంతుగా కృషఙ చేస్తున్నామని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెప్పారు. కబడ్డీ క్రీడాకారులు ప్రతీరోజు సాధనచేస్తే ఉత్తమ క్రీడాకారులుగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. కనీసం రోజూ రెండుగంటల పాటు క్రీడా మైదానంలో కబడ్డీ సాధనచేస్తే ప్రో కబడ్డీ లీగ్‌కు ఎంపికవుతారని క్రీడాకారులకు సూచించారు. క్రీడాకారులు క్రీడలతో పాటు చదువులో కూడా రాణించినట్లయితే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని స్పష్టంచేశారు. పురాతనమైన కబడ్డీ క్రీడకు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఆదరణ లభిస్తున్నదని తెలిపారు. దేశంలో అమితంగా ఆదరణ పొందిన క్రికెట్‌ను తలదన్నుతూ ప్రోకబడ్డీ పేరుతో ముందుకు సాగుతుందని అన్నారు. దీనికి నిదర్శనం ప్రోకబడ్డీ మ్యాచ్‌లు విజయవంతం కావడమే సాక్ష్యం అన్నారు. ఈ కబడ్డీ ఎంపికలో అన్ని విభాగాల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15వ తేదీన జనగామలోని ర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొంటారని వెల్లడించారు. కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ జిల్లా స్థాయి ఎంపికలకు సుమారుగా 210 మంది క్రీడాకారులు హజరయ్యారని శ్రీనివాస్‌ తెలిపారు.