కలెక్టరేట్‌ ముందు వంటావార్పూతో నిరసన

కడప,జనవరి23(జ‌నంసాక్షి): భూ సాధన కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్‌ ముందు పేదలు ‘ వంటా-వార్పు ‘ కార్యక్రమం ద్వారా బుధవారం నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి పేదలు భారీ ఎత్తున తరలివచ్చారు. గురువారం కూడా ఈ నిరసన కొనసాగనుంది. పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, భూ కబ్జాదారుల నుండి సాగు భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఈ వంటా-వార్పు కార్యక్రమంలో భూసాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్‌, అన్వేష్‌, రైతాంగం జిల్లా కార్యదర్శి దస్తగిరెడ్డి, సిపిఎం నగరాధ్యక్షులు రామ్మోహన్‌, వివిధ జిల్లాల పేదలు పాల్గొన్నారు.