కళంకితుల్లో ఇద్దరు వెలి

సబిత, ధర్మానా రాజీనామా!
సీఎంతో అరగంట భేటీ
మీడియాతో మాట్లాడకుండా
సొంత వాహనాల్లో తిరుగుటపా
హైదరాబాద్‌, మే 19 (జనంసాక్షి) :
కళంకిత మంత్రుల్లో ఇద్దరిపై వేటు పడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులకు కారణమైన జీవోలు జారీ చేసిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఆదివారం రాత్రి తమ పదవులకు రాజీనామా చేసినట్టుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో అధిష్టానం కళంకితులను తొలగించాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా సమాచారం. సీఎం వారిని ఎంతగా వెనకేసుకు రావాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధినేత్రి సోనియాగాంధీ ఈ విషయమై సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసి తమ ఆదేశాలు పాటించి తీరాలని పేర్కొన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. శనివారమే ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన సీఎం మంత్రుల రాజీనామాలపై తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. చివరికి అధిష్టానం ఆదేశాల ప్రకారం మంత్రులను జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. అధిష్టానం అభిమతాన్ని వారికి చెప్పి రాజీనామాలు కోరారు. సుమారు అరగంటపాటు సీఎంతో భేటీ అయిన సబిత, ధర్మాన ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలు సమర్పించి వెనుదిరిగారు. ధర్మాన తన వాహనంపై అధికారిక చిహ్నాలను తొలగించుకోగా, సబిత ఓ ప్రైవేటు వాహనంలో వెళ్లిపోయారు. అంతకుముందు ముఖ్యమంత్రితో మంత్రులు తీవ్రస్థాయిలో చర్చలు జరిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. అధిష్టానం నిర్ణయం ఇదే రాజీనామా చేయడం తప్ప తానేమీ చేయలేనని సీఎం వారికి నచ్చజెప్పారు. వ్యాన్‌పిక్‌ కేసులో తనపై చార్జిషీట్‌ నమోదు అయినప్పుడు చేసిన రాజీనామా అంగీకరిస్తేనే గౌరవంగా ఉండేది కదా ఇప్పుడెందుకు ఇలా అవమానించడం అంటూ ధర్మాన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ధర్మాన, సబితను అనునయించిన సీఎం తన పరిస్థితిని వివరించినట్లుగా తెలిసింది. కేంద్రంలో అవినీతి ఆరోపణలపై పవన్‌కుమార్‌ బన్సల్‌, అశ్వనీకుమార్‌తో అధిష్టానం రాజీనామా చేయించిందని, ఈ నేపథ్యంలో తాను నిమిత్తమాత్రుడేనని సీఎం వారికి నచ్చజెప్పారు. దీంతో మంత్రులిద్దరూ రాజీనామా లేఖలు ఆయన చేతిలో పెట్టి వెనుదిరిగారు. మంత్రులు వెళ్లిపోయిన అనంతరం సీఎం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. అయితే అవినీతి ఆరోపణలతో రాష్ట్రం హోం శాఖ మంత్రి రాజీనామా చేయడం ఇదే మొదటిసారి.
ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి తిరిగివచ్చిన మరుక్షణం నుంచే కళంకిత మంత్రులపై వేటు పడనుందనే వార్తలు వెలువడ్డాయి. సీబీఐ చార్జిషీట్‌లో పేరు నమోదై న ధర్మానప్రసాద్‌రావు, సబితాఇంద్రారెడ్డిని పదవుల నుంచి వీలనైంత త్వరలో తొలగించాలని అధిష్టానం సీఎంను ఆదేశించినట్టు సమాచారం. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోఉన్న ముఖ్యమంత్రికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అహ్మద్‌పటేల్‌ ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్టు పార్టీవర్గాలే చెబుతున్నాయి. అయితే ఆ ఫైళ్లపై సంతకాలు చేసినందుకు మంత్రులెవ్వరూ లబ్ధి పొందలేదని, కేవలం వైఎస్‌ కుటుంబం మాత్రమే లబ్ధిపొందిందని కిరణ్‌ వివరించారు. అందువల్ల వారి శాఖలు మారిస్తే సరిపోతుందని అధిష్టానానికి కిరణ్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై దేశ వ్యాప్తంగా ఒకే విధానం అనుసరిస్తున్నందున, మీ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ఖరాఖండిగా చెప్పడంతో కిరణ్‌ నిస్సహాయంగా ఉండిపోయినట్టు సమాచారం. తాజాగా ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించిన విషయాన్ని అధిష్టానం గుర్తు చేసింది. వారిని తొలగించాల్సిందేనని, అయితే అది ఎప్పుడు? ఎలా అనేది మీ అనుకూలత బట్టి నిర్ణయించుకోవాలని చిన్న వెసులుబాటు కల్పించింది. అయితే మిగిలిన మంత్రులపై ఆరోపణలున్నప్పటికీ వారిపై కోర్టు తీర్పులు వచ్చిన తరువాత చర్యలు తీసుకోవచ్చని అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ఉన్నందునా అంతకంటే ముందే వారిని తప్పించవచ్చని సమాచారం. ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేయడం, పైగా ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్‌కు సంకట స్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ధర్మాన ప్రసాదరావును మంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న సమాచారం జోరందుకోవడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఆయన అనుచరులు, కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మాన కూడా ఈ వ్యవహారంపై పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపు మేరకు ఆయన హుటాహుటినా హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఎంతో భేటీ తరువాతే తన భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. మంగళవారం ఆయన తన నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. ధర్మానపై వేటు పడుతుందనే ప్రచారం నేపథ్యంలో ధర్మాన అనుచరులు శ్రీకాకుళం జిల్లాలో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచిన ధర్మానకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన కూడా తన వర్గంతో శనివారం భేటీ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ఒక నిర్ణయానికి వద్దామని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి కొండ్రు మురళీ, కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ధర్మానకు అండగా నిలబడినట్టు సమాచారం.

తాజావార్తలు