కాంగ్రెస్‌ను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు

` సీఎం రేవంత్‌ అసంబద్ధ హామీల వల్ల సంక్షోభంలోకి రాష్ట్రం
` కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. : కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ ప్రజలు రేవంత్‌ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేవంత్‌ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి. ‘‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. జీహెచ్‌ఎంసీతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్‌ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్‌ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్‌ ప్రశంసించారు. ‘‘డంపింగ్‌ యార్డ్‌ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది బీఆర్‌ఎస్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండవ ఘనత సాధించిన పార్టీగా మన గర్వం’’ అని కేటీఆర్‌ తెలిపారు. కేటీఆర్‌ సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించి కార్యకర్తలు స్వాగతం పలికారు. కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్‌ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

తాజావార్తలు