కాబూల్‌ ఆత్మాహుతి దాడిలో 14మంది మృతి

దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోడీ

కాబూల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): ఆప్ఘనిస్తాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది.   కొందరు దుండగులు మినీ బస్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 14 మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.. ప్రభుత్వ ఉద్యోగులను వారి కార్యాలయాలకు తీసుకెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగిందని ఓ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏప్రిల్‌ 19న కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 64 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అప్ఘనిస్తాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు. నేపాల్‌ సెక్యూరిటీ గార్డులు ప్రయాణిస్తున్న మినీబస్సుపై దుండగుల అత్మాహుతి దాడి హేయమైన చర్య. ప్రమాదంలో 14మంది సెక్యూరిటీ గార్డుల మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఇలాంటి భయంకరమైన ఆత్మాహుతి దాడులకు సంబంధించి నేపాల్‌ ప్రభుత్వానికి భారత్‌ పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.