కారు, కాంగ్రెస్‌, నోటాలో ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా..

` బీజేపీ ఎంపీ అర్వింద్‌ తీవ్ర వ్యాఖ్యలు
` మరోసారి వివాదంలో నిజామాబాద్‌ ఎంపీ
` సొంత పార్టీ నేతలే మండిపడుతున్న వైనం
నిజామాబాద్‌(జనంసాక్షి): బీజేపీ నేత, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మరోసారి నోరు జారారు. నిత్యం వివాదాల్లో ఉండే ఆయన.. తాజాగా బుడబుక్కల కులాన్ని తక్కువ చేసి మాట్లాడారు. వారి వేషధారణను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అర్వింద్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. బుడబుక్కల కులంపై నోరు పారేసుకున్నారు. వెంటనే సరిచేసుకునేందుకు క్షమించండి అని కోరారు. మంత్రి కేటీఆర్‌ను దూషిస్తూ బుడబుక్కల పదం వాడారు.ఆ తర్వాత నోరు జారిన విషయం గమనించి బుడబుక్కల కులాన్ని కించపర్చేందుకు తాను ఆ మాట అనలేదని, కేటీఆర్‌ వేషధారణ అందుకు సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్య చేశానని వివరించారు. అర్వింద్‌కు మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువేనని, ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మరీ రైతులను మోసం చేసిన ఘనత ఆయన సొంతమని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శస్తున్నారు.సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులపై అర్వింద్‌ తరచూ అవాకులు చెవాకులు పేలుతుంటారని, ఆ విమర్శలను గులాబీ నేతలు పెద్దగా పట్టించుకోక పోవడంతో మాటల దాడిని మరింత తీవ్రం చేసి ఉంటాడని ఎద్దేవా చేశారు. ఆర్వింద్‌ తీరుపై ఎమ్మెల్సీ కవిత రెండు మూడుసార్లు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నిజామాబాద్‌ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కూడా హెచ్చరించారు. అర్వింద్‌ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి మరీ ఓడిస్తానన్నారు.అయినా అర్వింద్‌ తీరు మారలేదు. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ను విమర్శించబోయి మళ్లీ నోరు పారేసుకున్నారు. బుడబుక్కల వేషధారణను కించపరిచేలా మాట్లాడారు. అంతేకాదు ఎన్నికల్లో కారుకు ఓటేసినా, కాంగ్రెస్‌కు ఓటేసినా ఇంకా ఎవరికి వేసినా బీజేపీ పువ్వు గుర్తుకే పడుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఎన్నికల వ్యవస్థపైనే అనుమానాలు కలిగేలా మాట్లాడిన అర్వింద్‌ తీరుపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు.