కార్గిల్‌ వీరులకు ప్రధాని అంజలి

ట్విట్టర్‌లో ఆనాటి ఘటనలు స్మరణ

అమర్‌జవాన్‌ వద్ద త్రివిధ దలాధిపతుల నివాళి

న్యూఢిల్లీ,జూలై26(జ‌నంసాక్షి): కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్‌ యుద్ధ వీరులకు నివాళులర్పించారు. పాకిస్థాన్‌పై కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించి నేటికి 19 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మోదీ ట్విటర్‌ ద్వారా యుద్ధ వీరులకు వందనం చేశారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో పనిచేసిన సైనికులందరికీ ఈ దేశం కృతజ్ఞతలతో అంజలి ఘటిస్తోంది. సాహసవంతులైన మన సైనికులు భారతదేశం సురక్షితమని రుజువు చేశారు. దేశంలోని శాంతియుత వాతావరణాన్ని నాశనం చేయాలనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

కార్గిల్‌ దివస్‌ సందర్భంగా యుద్ధ సమయంలో భారత ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయిపై మోదీ ప్రశంసలు కురిపించారు. ‘కార్గిల్‌ యుద్ధ సమయంలో అద్భుతమైన రాజకీయ నాయకత్వాన్ని అందించిన

అటల్‌ జీని భారత్‌ ఎల్లప్పుడూ సగర్వంగా గుర్తు చేసుకుంటుంది. దేశాన్ని ఆయన ముందుండి నడిపించారు. సైన్యానికి మద్దతిచ్చారు. ప్రపంచం ముందు భారత వైఖరిని స్పష్టంగా చూపించారు’ అని మోదీ మరో ట్వీట్‌ చేశారు.కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌ ట్విటర్‌ వేదికగా కార్గిల్‌ యుద్ధ వీరులకు వందనం చేశారు. మన వీర సైనికుల ధైర్యం, పరాక్రమం, త్యాగాలకు సెల్యూట్‌ అని ట్వీట్‌ చేశారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ స్టాఫ్‌ అడ్మైరల్‌ సునిల్‌ లంబా, చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా దిల్లీలోని అమర జవాన్‌ జ్యోతి వద్ద కార్గిల్‌ దివస్‌ను పురస్కరించుకుని నివాళులర్పించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఈ సందర్భంగా చక్కని సైకత శిల్పాన్ని రూపొందించారు. ధైర్యసాహసాలు గల మన సైనికులను చూసి గర్వపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. అటు మద్రాస్‌లోని స్మారక స్థూపం వద్ద కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నార్తర్నర్‌ ఆర్మీ కమాండర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌సింగ్‌ నివాళి అర్పించారు. ద్రాస్‌లోని స్మారకం వద్ద సాధారణ పౌరులు కూడా నివాళి ప్రకటించారు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ సాధించిన విక్టరీకి గుర్తుగా కార్గిల్‌ విజయ్‌ దివస్‌ జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఘటనలు గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్‌లో నివాళి

కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి, సైనికాధికారులు పాల్గొన్నారు. కార్గిల్‌ యుద్ధంలో వీర మరణం పొందిన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి, సైనికాధికారులు నివాళులర్పించారు.