కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దారుణం

మరో పోలీస్‌ అధికారి కిడ్నాప్‌

శ్రీనగర్‌,జూలై28(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జేకే పోలీస్‌ స్పెషల్‌ పోలీసు అధికారి (ఎస్‌పీఓ)ని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. ఇప్టపికే ఇద్దరు పోలీసులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు తాజా గటనతో సవాల్‌ విసిరారు. తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఎస్‌పీఓ షకీల్‌ అహ్మద్‌ లోన్‌ను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. దీనిపై జమ్మూకశ్మీర్‌ డీజీపీ ఎస్‌.పీ.వైద్‌ను సంప్రదించగా, తమకు అందిన సమాచారాన్ని నిర్దారించే పనిలో ఉన్నామని, బంధువుల ఇంటికి వెళ్లినట్టు షకీల్‌ అహ్మద్‌ కుటుంబసభ్యులు తెలిపారని, ఇంతకుమించి ఇప్పటికిప్పుడు ఏవిూ చెప్పలేమని సమాధానమిచ్చారు. ఇటీవలే కానిస్టేబుల్‌ సలీమ్‌ ఖాన్‌ను కుల్గాం జిల్లాలోని ముతల్‌హమా ఏరియా నుంచి ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన ఘటన మరచిపోక ముందే తాజా ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. చిత్రహింస గాయాలు, బుల్లెట్లతో ఛిద్రమైన సలీం ఖాన్‌ మృతదేహాన్ని ఆ తర్వాత పోలీసులు కనుగొన్నారు.