కాశ్మీర్‌ తొలి మహిళా సీఎంగా మహబూబా

5

జమ్ము,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.  పదమూడో ముఖ్యమంత్రిగా,తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ లో ఉదయం 11 గంటలకు గర్నవర్‌ వోహ్రా  ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె అయిన 56 ఏళ్ల మెహబూబా.. రాష్ట్రంలో  తొలి మహిళా సీఎంగా, దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు.  న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి  అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ ఇదివరకు మాదిరిగానే తన వాటా దక్కించుకునే పరిస్థితి ఉన్నా పోర్ట్‌ఫోలియోలు మారే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కౌర్‌ బాదల్‌, బీజేపీ నేత రాంమాధవ్‌ తదితరులు హాజరయ్యారు. కాగా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ దూరంగా ఉంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పీడీపీ- బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఎట్టకేలకు చర్చల అనంతరం ప్రతిష్టంభన తొలగటంతో ప్రభుత్వ ఏర్పాటు సుగమమం అయింది. 87 స్థానాలున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ) 15, కాంగ్రెస్‌12 సీట్లు గెల్చుకున్నాయి. ముఫ్తీ మరణం తరవాత దాదాపు మూడు నెలలలుగా ప్రతిష్టంభనకు తెరపడింది.