కుంభకోణాలే జగన్‌ నవరత్నాలు

– వాటిని కాపీ కొట్టడం ఎవరితరం కాదు

– కాపులకు 5శాతం రిజర్వేషన్‌లు ఇస్తుంటే వైసీపీ విమర్శిస్తుంది

– మంచిని వ్యతిరేకించే పార్టీ వైసీపీ

– పేదల సంక్షేమకోసం టీడీపీ ఎప్పుడూ శ్రమిస్తుంది

– ఏపీ మంత్రి యనమల రామకృష్ణ

అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : కుంభకోణాలే జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టోలో రూపొందించిన నవ రత్నాలను టీడీపీ కాపీ కొట్టారనడంపై మండిపడ్డారు. జగన్‌ నేరాలను కాపీ కొట్టడం ఎవరితరమూ కాదని అన్నారు. ఎమ్మార్‌ కుంభకోణంలో జగన్‌ ఒక రత్నం, టైటానియం కుంభకోణం ఇంకో రత్నం అన్నారు. వోక్స్‌ వ్యాగన్‌ కుంభకోణం జగన్‌ మరో రత్నం, మద్యం కుంభకోణం ఇంకో రత్నం అని, ముగ్గురాయి కుంభకోణం ఒక రత్నమైతే.. బాక్సైట్‌ కుంభకోణం ఇంకో రత్నం అని ఎద్దేవా చేశారు. ఇనుప ఖనిజం కుంకోణం జగన్‌ మరో రత్నం, వాన్‌పిక్‌ కుంభకోణం ఇంకో రత్నం అని పేర్కొన్నారు. లేపాక్షి కుంభకోణం జగన్‌ మరో రత్నం, జలయజ్ఞం ధన యజ్ఞం ఇంకో రత్నం అని విమర్శించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్‌ కుంభకోణాలకు అంతేలేదని మంత్రి యనమల పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లు, 13 ఛార్జిషీట్లు, 16నెలలు జైలు ఇవి తప్ప జగన్‌ సాధించిందేముందని ప్రశ్నించారు. పేదలకు పింఛన్ల పెంపు, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వైసీపీ నిందిస్తోందన్నారు. మంచి చేయడాన్ని వ్యతిరేకించడం, సమాజానికి చెడు జరగాలనికోరే పార్టీ వైసీపీ అన్నారు. సమాజానికి చెడు జరగాలని కోరుకునే పార్టీ వైసీపీ అని, అన్నివర్గాల ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. పేదలకు పింఛన్లను పెంచడం, కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వైసీపీ విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం టీడీపీ పనిచేస్తే, ప్రజాధనం దోపీడీకి వైసీపీ ఉందని అన్నారు. నిర్మాణానికి టీడీపీ నిదర్శనమైతే, విధ్వంసానికి వైసీపీ నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై భాజపా, వైకాపా నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఢిల్లీవెళ్లి కాపు రిజర్వేషన్ల గురించి అడగలేని అసమర్థులు.. ఇప్పుడు కాపులకు మేలు చేసిన తెదేపాను నిందిస్తున్నారన్నారు. కాపుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఢిల్లీ పంపామని.. దానిపై ఏనాడైనా భాజపా, వైకాపా నేతలు మాట్లాడారా అని ప్రశ్నించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లపై భాజపా, వైకాపాకు ఉన్న అభ్యంతరం ఏమిటని యనమల ప్రశ్నించారు.