కుప్పంలోనూ కుప్పకూలిన టీడీపీ

` మున్సిపాలిటీని కైవసం చేసుకున్న అధికార పార్టీ
` మాజీ సీఎం ఇలాఖాలో వైసీపీ పాగా
చిత్తూరు,నవంబరు 17(జనంసాక్షి):కుప్పంలో అధికార వైసిపి పాగా వేసింది. ఇక్కడ జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది. ఊహించని రీతిలో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ మొత్తం 18 స్థానాల్లో గెలిచింది. టీడీపీ కేవలం 6 వార్డుల్లో మాత్రమే గెలిచింది. అయితే 14వ వార్డు వివాదాస్పద రీతిలో ఏకగ్రీవమైంది. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అటు కుప్పం లో.. ఇటు వైసీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది.. మొదలుకుని పోలింగ్‌ ముందు రోజు వరకూ వైసీపీ పెద్దలు, మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి..అధికార పార్టీని గెలిపించుకునేందుకు భారీ వ్యూహం పన్నారు. కుప్పం ఎన్నికలపై తెలుగు తమ్ముళ్లు.. పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఏ మాత్రం బలం లేకున్నా అధికార పార్టీ కావడం వల్ల ఉన్న అన్ని అనుకూలతలను వినియోగించుకుందని మొదట్నుంచీ టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది.
రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికలు జరగ్గా అందరి చూపు.. నరాలు తెగేలా ఉత్కంఠ మాత్రం.. కుప్పం మున్సిపాలిటీపైనే పడిరది. ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్‌.. 11 గంటలయ్యే సరికి దాదాపు గెలుపెవరిదన్న విషయం తెలిసిపోయింది. మొదటి రౌండ్‌లో 14 వార్డులకు సంబంధించిన ఫలితాలు వెలువడగా.. ఇందులో వైసీపీ 12 స్థానాల్లో గెలవగా.. టీడీపీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక రెండో రౌండ్‌లోనూ సేమ్‌ సీన్‌ రిపిట్‌ అయ్యింది. అంతేకాదు.. నియోజకవర్గం లో కీలక నేతలుగా ఉన్న కొందరు పోటీ చేయగా వారు కూడా ఘోరంగా ఓడిపోవడం గమనార్హం.ఇప్పటివరకు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో 15 వార్డులకుగాను 13 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితమైంది. కాగా, హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్‌ పక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కౌంటింగ్‌ పక్రియను అధికారులు కొనసాగించారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కౌంటింగ్‌ మొదలైనప్పట్నుంచీ ఇప్పటి వరకూ పలు ఘటనలు వెలుగుచూడగా తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. 11వ వార్డులో కేవలం 6 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. అయితే మళ్లీ రీ కౌంటింగ్‌ జరపాల్సిందేనని.. ఈసారీ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్‌ మేరకు రీ కౌంటింగ్‌ జరిపించారు. అయితే ఈ రీ కౌంటింగ్‌లో కూడా టీడీపీ అభ్యర్థి కస్తూరి గెలుపొందారు.