కేరళ విద్యార్థినిని వేధించిన వ్యక్తి అరెస్ట్
త్రిసూర్,జూలై28(జనం సాక్షి): చదువుకుంటూనే సంపాదిస్తున్న విద్యార్థినిని ఆన్లైన్లో ట్రోల్ చేసిన వ్యక్తినికేరళ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న హనన్ హవిూద్ తన తరగతి వేళలు పూర్తయిన తర్వాత రకరకాల పనులు చేస్తూ ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఆమె చేపలు కూడా అమ్మారు. దీంతో చాలామంది ఆమెపై అవమానకర వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.ఈ పరిణామాలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. హనన్ను వేధిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వయనాద్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. హనన్ త్రిసూర్లో నివసిస్తున్నారు. ఆమె ఓ కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఆమె రేడియో కార్యక్రమాలు, చేపలు అమ్మడం వంటివి చేస్తున్నారని కేరళలోని ఓ పత్రిక తెలిపింది.