కొండాది ద్రోహబుద్ది

ఏ సిద్దాంతాలతో కాంగ్రెస్‌లో చేరుతున్నారు: పల్లా

మహబూబాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కొండ విశ్వేశ్వరరెడ్డి ఏ సిద్ధాంతాలతో కాంగ్రెస్‌ లోకి వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మండలి విప్‌ పల్లా రాజేశ్వరరెడ్డి నిలదీశారు. రంగారెడ్డి, వికారాబాద్‌ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్‌ పార్టీలోకి ఎలా వెళ్తున్నావని ఆయన్ని ప్రశ్నించారు. చేవెళ్లలో అభివృద్ది జరగలేదని అనడం సరికాదన్నారు. ఆయనకు పార్టీ అత్యున్నత గౌరవం ఇచ్చిందని అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్‌ అడ్డుకున్నదని, ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారని, అలాంటి వారితో కలిసి ఎలా పనిచేస్తావని మండిపడ్డారు. మహబూబాబాద్‌

లో పల్లా విలేకరులతో మాట్లాడారు. కొండ విశ్వేశ్వరరెడ్డికి టీఆర్‌ఎస్‌ సముచిత స్థానం కల్పించిందని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. ఎంపీగా గెలిపించి.. పార్లమెంటులో అత్యధికసార్లు మాట్లాడే అవకాశం కల్పించిందని తెలిపారు. సిద్ధాంతాలకు టీఆర్‌ఎస్‌ తిలోదకాలు ఇచ్చిందంటున్న విశ్వేశ్వరరెడ్డి నాలుగేండ్లు ఏమి చేశారని ప్రశ్నించారు. వికారాబాద్‌ అభివృద్ధి కుంటుపడిందని విశ్వేశ్వరరెడ్డి అంటున్నారని, దానికి ఆయనే కారణమని స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి తన మనుషులైన పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కేఎస్‌ రత్నం, కనకయ్యలను ఇతర పార్టీలకు పంపించాడని పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు.