కొంపముంచుతున్న ట్రంప్‌ వాణిజ్య విధానాలు

చమురు ధరలూ సంక్షభానికి కారణాలు

ఆర్‌బిఐ చర్యల కోసం ఆర్థికవేత్తల చూపులు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెరిగిన చమురు ధరల కారణంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరగి పోతున్నాయి. అంతేగాకుండా రూపాయి మారకవిలువ దిగజారిపోతోందని అంటున్నారు.పివీమన్మోహన్‌ ద్వయం తెచ్చిన ఐఎంఎఫ్‌ాప్రపంచ బ్యాంకు ఆదేశిత ఆర్థిక విధానాలనే వాజ్‌పేయ్‌ ప్రభుత్వం అమలు చేసింది. అలాగే మన్మోహన్‌ సర్కారు బాటలోనే మోడీ ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి ఆ పార్టీలు పరస్పరం విమర్శించు కోవడం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప నిజంగా మాత్రం కాదు.రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగి రూపాయిని నిలబెట్టాల్సిఉందని చాలామంది సూచిస్తున్నారు. 80శాతం చమురు ఎలాగూ దిగుమతి చేసుకొనేదే కనుక, క్రూడాయిల్‌ ధర పెరిగి, దేశీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల రేట్లు మరింత హెచ్చి నిత్యావసర, వినియోగ వస్తువులు ఖరీదు కాక తప్పదు. ఇప్పటికే ఇరాన్‌ చమురు కూడా కాదనుకుంటున్నందున చమురు లభ్యత మరింత తగ్గి కొత్త కష్టాలు ఎదురు కావచ్చన్న ఆందోళనా ఉంది. ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి ఆర్‌బిఐ కష్టాలు పడుతున్న తరుణంలోనే రూపాయి మరింతగా కృశించిపోతున్నది. రూపాయిని కాపాడటానికి రిజర్వుబ్యాంకు వద్ద అనేక మార్గాలు ఉండివుంటాయని, తగిన సమయంలో నిర్ణయాలు చేస్తుందని ఆర్థిక నిపుణులు హావిూ ఇస్తున్నప్పటికీ, ఈ దుస్థితి ఎంతకాలం కొనసాగుతుందన్నది అర్థంకాని ప్రశ్న. రిజర్వుబ్యాంకు చర్యలు సామాన్యుడికిఉపశమనం ఇవ్వలేని కాలం కూడా దాపురించవచ్చు. ఏ క్షణాన డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైనారో అప్పటినుంచి ఏ దేశానికీ ప్రశాంతత లేకుండాపోయింది. అమెరికా ఫస్ట్‌ నినాదంతో వాణిజ్య యుద్ధాలు ఆరంభించాడు. విదేశీ ఉత్పత్తులపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ వాణిజ్య రంగాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఇరాన్‌తో కయ్యానికి దిగడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆకాశాన్నంటి డాలర్లకు డిమాండ్‌ అధికంగా పెరిగిపోతున్నది. పెద్దనోట్ల రద్దు వంటిచర్యల కారణంగానే ఈ సంక్షోభం ఉత్పన్నమైందనీ, తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ మోదీ ప్రభుత్వం రిజర్వుబ్యాంకును నోరులేనిదానిగా మార్చివేసిందని విపక్షాలు అంటున్నాయి. ఆర్థిక రంగంలో కొత్త ఉత్పాతాలను తట్టుకొని నిలబడగల స్థితిలో ప్రజలు లేరు.

ద్రవ్యోల్బణం అదుపు తప్పితే మరిన్ని కష్టాలు తప్పవు. బ్యాంకు వడ్డీరేట్లు పెరగడం, రుణాలవిూద ప్రభావం వంటి సమస్యలు కూడా అనేకం. రూపాయి పతనమవుతున్నందున పెట్టుబడిదారులు డాలర్‌ సురక్షిత మైనదిగా భావించడంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా తరిగి పోతున్నాయి. డాలర్‌ విలువ కారణంగా వాణిజ్యలోటు హెచ్చుతూ ఐదేళ్ళ గరిష్టానికి చేరింది. రూపాయి విలువ తగ్గుదలతో ఎగుమతులకు మేలు జరగవచ్చని కొందరంటున్నారు. అయితే ఇప్పటికే అమెరికా, ఐరోపా మార్కెట్లలో విధించిన నిబంధనలవల్ల వాటికి ముప్పు ఏర్పడిన వాస్తవాన్ని విస్మరించరాదు. అంతేగాక దిగుమతుల భారం వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాన్ని గుర్తించాలి. డాలర్లు మన దేశం నుంచి తరలి పోకుండా పరిమితం చేయడానికి విలాస వస్తువుల విచ్చలవిడి దిగుమతులపై ఆంక్షలు విధించడం అవసరం అన్న భావనా ఉంది. దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక విధానాల వైపు ఇప్పటికైనా మళ్లాల్సి ఉంది. టర్కీ ఆర్థిక సంక్షోభం స్టాక్‌మార్కెట్‌ను, కరెన్సీ మార్కెట్‌ను కుదిపేస్తున్నది. దాని సంక్షోభం ఇప్పట్లో తీరేదికాదన్న వాస్తవం మరింత భయపెడుతున్నది. లీరా పతనం వర్థమాన మార్కెట్లన్నింటినీ ప్రభావితం చేసినప్పటికీ, భారతీయ రిజర్వుబ్యాంకు జోక్యం పూర్తిస్థాయిలో లేనందునే రూపాయి ఇంతగా ఉన్నదని కొందరి వాదన. రూపాయి పతనం ఐటీ, ఎగుమతులు ఇత్యాది రంగాలకు మేలుచేస్తుందని అంటున్నారు కానీ, సామాన్యుడిపై ధరాఘాతం తప్పడం లేదు. దిగుమతి చేసుకొనే ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి.