కోమటిరెడ్డి ఇంటిని ముట్టడించిన అమరవీరుల కుటుంబాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 22: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. గురువారం నాడు ఆయన ఇంటిని ముట్టడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నిస్తూ లోటస్‌పౌండ్‌లోని కోటిరెడ్డి నివాసాన్ని వారు ముట్టడించారు.  తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మకు శాంతి చేకూర్చడం ఇదేనా అని ప్రశ్నించారు. కడపుకోత కలిగిన ఆ బాధ తమకు తెలుసన్నారు. ఇప్పటికైనా తెలంగాణ కోసం పాటు పడాలని సూచించారు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేస్తే వచ్చే ఎన్నికల్లో తాము గెలిపించి మళ్లీ మంత్రి పదవులకు పంపిస్తామని అన్నారు. తెలంగాణ కోసం పోరాడితే కడుపులో పెట్టుకొని కాపాడుతాం. మీకు అండగా నిలుస్తాం. తెలంగాణను వ్యతిరేకిస్తే కచ్చితంగా నిలదీస్తాం. మీపై పోరాడుతాం. ఎన్నికల్లో నష్టం కలిగిస్తామని వారు అన్నారు. ఇప్పటికైనా వేరరే ఆలోచనలు లేకుండా తెలంగాణ కోసం పోరాడాలని, ఇతర పార్టీలోకి వలస పోవద్దని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో కలిసిరావాలని వారు డిమాండ్‌ చేశారు.